Friday, July 15, 2011

అమృతమే చెల్లించి ఆ విలువతో..

పేరాశతో తన పసుపు కుంకుమలనే అమ్ముకున్న తెలుగింటి ఇల్లాలు. డబ్బు మీద వ్యామోహంతో తన జీవితాన్నే పణంగా పెట్టి ఆస్థిపరురాలిగా మారాను అనుకుంటూ తనని తాను అసలైన బీదరికంలోకి సాగనంపుకున్న మహిళ. నిజం తెలుసుకుని పశ్చాత్తాప పడుతూ తన మాంగల్యాన్ని తిరిగి కొనుక్కోవాలని ఆరాటపడే ఒక భార్య.


పెళ్లి అంటే మూడో మనిషితో పంచుకోలేని ఒక అపురూప బంధం అన్న నిజం తెలుసుకోలేని ఒక ఇల్లాలి కథ "శుభలగ్నం". యస్.వి.కృష్ణారెడ్డిగారి దర్శకత్వం, సంగీత దర్శకత్వం లో 1994లో వచ్చిన ఒక మంచి చిత్రం. సినిమా మొత్తాన్నీ ఒక్క పాటలో చూపించగలిగిన పాట "చిలక యే తోడు లేక". ఈ పాట పరిచయం లేని తెలుగు సంగీత ప్రియులు ఉంటారని నేననుకోను. సంగీతం, సాహిత్యం, గాత్రం అధుతంగా సమకూర్చిన మంచి పాట.

తెలిసి తెలిసి ఎండమావులు మాత్రమే కనిపించే ఎడారి వెంట ఒంటరిగా పరుగులు పెట్టిన చిలకని, సౌభాగ్యానికి వెల ఎంతమ్మా అంటే ఏం చెప్పగలుగుతుంది? సంతలో వస్తువులా పసుపు కుంకుమలని అమ్ముకున్న తరువాత, భర్తనే బంధం ఎలా తిరిగి వస్తుంది? 

 పల్లవి :
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
      తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
      మంగళ సూత్రం అంగడి సరుకా.. కొనగలవా చేజారాక
      లాభం.. ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక
                                             || చిలకా ఏ తోడు ||
.కోరస్: గోరింకా యేదే చిలకా లేదింకా || 2 ||

"అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే" ఈ పదాలకి ఉన్న అర్థాన్ని ఆలోచించడానికి కూడా నేను ఖచ్చితంగా అనర్హురాలిని అనిపిస్తూ ఉంటుంది నాకు. విన్న ప్రతిసారి ఈ వాక్యం నన్ను ఎక్కడికో తీస్కెళ్తూ ఉంటుంది. అతితెలివితో చేసిన తప్పిదాన్ని ఇంత బాగా వర్ణించగలరా ఎవరైనా? కాసుల వర్షంలో బీదతనం. ఎలా మెచ్చుకుని సిరివెన్నెల గారిని ఆయనకి మాత్రమే అర్హమైన స్థానంలో కూర్చోబెట్టాలో తెలీడంలేదు.
చరణం1 :
      బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
      వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
      అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
      కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
                                             || చిలకా ఏ తోడు ||
కోరస్: కొండంతా అండే నీకు లేదింకా || 2 ||

నిజమే, ధనంతో సుఖాన్ని పొందొచ్చేమో కానీ, అనురాగాల్ని అనుబంధాల్ని కొనగలమా? చుట్టూ కాసుల రాశులు కొలువుదీరి ఉన్నా, పెదవుల పై చిరునవ్వు పూయించేవారు, చెక్కిలిపై కన్నీటిని తుడిచేవారు, చెంత లేనప్పుడు వెలుగుల లోకంలో ఉన్నా అది అమావాస్యే అవుతుంది. మనం అనాథలే అవుతాం. సంపద మైకంలో ప్రపంచాన్ని మరచిపోయినా, అనాథలమన్న విషయం కళ్లు తెరిపించి నిజాన్ని చూపించేసరికి.. మనం నడిచి వచ్చిన తీరం మన కళ్లను దాటి ఎప్పుడో దూరం అయిపోయి ఉంటుంది. 
చరణం2 :
      అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో..
      మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో..
      ఆనందం కొనలేని ధనరాశితో.. అనాథగా మిగిలావే అమవాసలో
      తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా
                                             || చిలకా ఏ తోడు ||

చేసిన తప్పుని తెలుసుకుని ఎడారి వెంట కన్నీటితో సాగే ఆమని నటన అద్భుతం.. ఆమనిని మాత్రం డబ్బుల పంజరంలో పెట్టి, జగపతి బాబు, రోజా సంతోషంగా ఉండే సన్నివేశం చిత్రీకరణ పాట భావాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఇక ఆమనికి సర్వెంట్స్ అందరూ కలిసి డబ్బుని వడ్డించే సన్నివేశం, ఆ తర్వాత తన భర్తతో తను సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోవడం.. అన్నిటికన్నా అద్భుతం పాట చివర్లో ఆమని త్రాసుకి ఒకవైపు తాళిని మరో వైపు తన సంపదనంతా పెట్టి తన భర్తని తిరిగి పొందడానికి చేసే ప్రయత్నం.ఈ పాట చూడాలంటే ఇక్కడ నొక్కండి.

ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది, డబ్బు హోదా ఎంత ఉన్నా, మెట్టు మెట్టు ఎక్కుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా, మన ఆఙ్ఞని అనుసరించేవాళ్లు చుట్టు ఎందరున్నా.. మనతో కలిసిపోయే వాళ్లు, మన సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునే వాళ్లు లేని జీవితం నిజంగా వృధా అని..