Thursday, May 27, 2010

గమ్యం

గమ్యం. ఇది చీకటి,వెలుగు కి మరియు ఈరోజు, రేపటి కి భేదం తెలియని ఒక జీవితానికి, గమనం నేర్పించిన పాఠం. అసలు జీవితం అంటే ఏమిటో, ఆ జీవితం లో ప్రతి క్షణం ఎంత అమూల్యమైనదో, ఆ అమూల్యమైన క్షణాలను నలుగురికీ ఉపయోగపడేలా ఎలా జీవించాలో, అసలు మనిషి అంటే ఏమిటో 'గమ్యం' చాలా చక్కగా చూపిస్తుంది. ఆ చిత్రం(జీవితం) లోని సారాన్నంతా ఒక్క పాటలో ఎంతో అద్భుతంగా వివరించి చెబుతారు సిరివెన్నెల గారు. ఇది ఒక పాట అనడం కన్నా ఒక గొప్ప తత్వవేత్త తన జీవితం లోని ప్రతి రుచినీ అనుభవంచి, రంగరించి వెలువరిచిన గొప్ప జీవిత సత్యాలని చెప్పొచ్చేమో.. ఈ వాక్యాల అర్ధాన్ని తెలుసుకుంటే బాధలో ఉన్న ప్రతి మనిషికీ ఇది ఒక టానిక్ లాగా పని చేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. నాకు ఎన్నో సార్లు ఇదే పాట కొత్త కొత్త అర్ధాలతో ఊరటనిచ్చింది. అందుకే సిరివెన్నెల గారన్నా, ఆయన మాటలన్నా, పాటలన్నా నాకు చాలా చాలా ఇష్టం.మరి అంతగా ప్రభావితం చూపించే మన "ఎంతవరకు" పాట గమనం ఎలా సాగుతుందో చూద్దామా..?!


ఎంతవరకూ ఎందుకొరకు వింత పరుగూ అని అడక్కూ..
గమనమే నీ గమ్యమైతే బాట లోనే బ్రతుకు దొరుకు.
ప్రశ్న లోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు.
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా.. "ఎంతవరకు "


కనపడేవెన్నెన్ని కెరటాలు.. కలగలిపి సముద్రమంటారు..
అడగరే ఒక్కొక్క అల పేరూ..
మనకిలా ఎదురైన ప్రతి వారు మనిషనే సంద్రాన కెరటాలు..
పలకరేం మనిషీ అంటే ఎవరూ..
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది..
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి.
నీ ఊపిరి లో లేదా గాలీ వెలుతురు నీ చూపుల్లో లేదా..
మన్నూ మిన్నూ నీరూ అన్నీ కలిపితే నువ్వే కాదా గాథా.. "ప్రపంచం "


మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై..
నీడలు నిజాల సాక్ష్యాలే..
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే..
ఋతువులు నీ భావ చిత్రాలే..
ఎదురైన మందహాసం నీ లోని చెలిమి కోసం..
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం..
పుటుక చావు రెండే రెండు నీకవి సొంతం కావూ పోనీ..
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ.. "ప్రపంచం "


ఈ పాటని వర్ణించడానికి అద్భుతం అన్న పదం చాలా చిన్నది గా కనిపించడం లేదు అని మీరు అనగలరా..??అనలేరు. ఎందుకంటే ఆయన పాటల్లో ఉన్న భావం అలాంటిది. ఆయన పదాల్లో ఉన్న శక్తి అలాంటిది. ఎటువంటి భావాన్ని పలికించదానికి అయినా చాలా సులువైన పదాలతో పూర్తి చెయ్యగలరు.. అదే భావాన్ని అతి క్లిష్టమైన పదాలతోనూ పలికించగలరు. నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది.. అక్షరాలకు గానీ పదాలకు గానీ మనసు ఉంటే సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన తరువాత అవి చాలా గర్వపడతాయేమో అని. మరి, అంత మామూలు పదాలతో ఎవరూ ఊహించలేని గొప్ప అర్ధాన్ని పలికించడం అన్నది మామూలు విషయం కాదు కదా.


ఇక మన గమనం విషయానికి వస్తే, ఎంతవరకూ ఎందుకొరకు వింత పరుగు.. ఈ ప్రశ్న వేసుకోని వారు ఉంటారంటే నమ్మడం కొంచెం కష్టమే.. ఎందుకంటే ఏదో ఒక క్షణం లో ప్రతి ఒక్కరు ఇలా భావిస్తారు. కానీ ఆ గమనమే మన గమ్యం ఐనప్పుడు బ్రతుకంతా బాటలోనే కదా దొరికేది.. మన ప్రశ్న కి బదులు ఆ ప్రశ్న లోనే కదా దొరికింది, కానీ ఈ నిజం అన్ని హ్రుదయాలకు తెలియదు. జీవితాన్ని అర్ధం చేస్కున్న హ్రుదయానికి మాత్రమే తెలుస్తుంది.
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా..
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా..
వాహ్... శాస్త్రి గారు.. ప్రపంచాన్ని ఇంత గొప్ప గా అర్ధం చేస్కున్న వాళ్లు ఈ ప్రపంచం లో ఇంకెవరూ ఉండరేమో.. ప్రపంచం నీలోనే ఉన్నప్పుడు నువ్వే ప్రపంచానివి కదా..ప్రపంచం నువ్వే అయినప్పుడు నీకు ఎదురైన వాళ్లంతా నీ ప్రతిరూపాలే కదా.. నువ్వు చెయ్యవలసింది ఒక్కటే.. ఈ ప్రపంచం నీలోనే ఉందని గుర్తించాలి.. అది జరిగిన నాడు నీకు ఎదురైన ప్రతి జీవిని నిన్ను గా గుర్తించి పలకరిస్తావు.. అదేనేమో విశ్వజనీనమైన ప్రేమ అంటారు..


కనిపించే ఎన్నెన్నో కెరటాల సముదాయాన్నే సముద్రం అంటారట.. మరి ఒక్కొక్క కెరటాన్ని పేరు పెట్టి పిలవం ఎందుకు..? మనిషనే సంద్రం లో మనకి ఎదురైన వారంతా కెరటాలట.. మరి మనిషీ అంటె ఎవరూ పలకరెందుకు..? ఈ ప్రపంచపు గదిలో ఉన్నది నువ్వే.. నీ మది సరిగా చూస్తున్నదా..? నీ చుట్టూ ఉన్న అద్దాలలో విడి విడి రూపాలు మాత్రం నువ్వు కాదని భ్రమింపజేస్తున్నాయి.. నువ్వు పంచభూతాల సమాహారం.. నీ ఊపిరి లో గాలి ఉంది. నీ చూపుల్లో వెలుతురు ఉంది. ఈ నేల, ఆకాశం, నీరు అన్నీ కలిపితే నువ్వే..


నువ్వు మనసులో ఏవైతే ఆలోచిస్తావో, అవే నీకు ద్రుశ్యాలై బయట కనిపిస్తాయి. ఎంత గొప్ప సత్యం..!! నువ్వు ఎలా ఆలోచిస్తావో అదే నీకు కనిపిస్తుందట.. మంచిగా ఆలోచిస్తే మంచి కనిపిస్తుంది. చెడుగా ఆలోచిస్తే చెడు ఎదురవుతుంది. చివరికి నీడ కూడ ఎదో ఒక నిజం యొక్క సాక్ష్యమే..నీ లోని లోపాలే నీకు శత్రువులు.. నీ ఇష్టాలే నీకున్న స్నేహితులు. ఋతువులు కూడా నీ భావ చిత్రాలే.నీలోని చెలిమి కోసం ఒక మందహాసం స్నేహహస్తాన్ని అందిస్తుంది. మోసం , రోషం, ద్వేషం అన్నవి నీ మకిలి మదికి గుర్తులు. ఇవన్నీ వదిలి ఆ స్నేహహస్తాన్ని అందుకోవాలి.
పుటుక చావు రెండే రెండు నీకవి సొంతం కావూ పోనీ..
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ..
జీవితం లో ఒక్క సారైనా సిరివెన్నెల గారిని కలిసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలన్న నా కోరిక ఈ భావాన్ని చూశాక ఇంకా బలపడింది. చిన్న చిన్న మాటల్లో ఎంత గొప్ప అర్ధాన్ని దాచారు..!! పుట్టుక చావు మనకి సొంతం కావట. అవి మన చేతుల్లో లేవు కదా.. కానీ ఆ రెండిటి మధ్యలో జీవిత కాలం మొత్తం మనదే.. ఇక ఏం రంగులు దిద్దుకుంటామన్నది మన చేతుల్లో ఉంది.. మరి ఇంద్రధనుస్సు ని మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి సిద్ధమా..?!
మీ సలహాలను స్వీకరించడానికి నేను సిద్ధం.. :)
మీ అపర్ణ.

1 comments:

Viswa Ravi said...
the command and ability to understand what Sirivennela is conveying.. tells me to suggest you to write some pen-down.. ee age lo neekunna paripakvata toooooooo good.... never stop what u r doing now.. glad to meet u here..

Monday, May 24, 2010

మొదటి పాట

దేనితో మొదలు పెట్టాలి.? ఎలా ముగించాలి..? ముగింపు సంగతి కాస్త పక్కన పెడితే సిరివెన్నెల గారి గురించి ఎలా మొదలు పెట్టాలి అన్న విషయం ఎంతకీ అంతు పట్టడం లేదు. ఏదో చిన్న పిల్లకాలువ గురించి ఐతే నాలుగు ముక్కల్లో / వాక్యాల్లో తేల్చెయ్యొచ్చు. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి నాలుగు వాక్యాల్లో తేల్చడం అంటే అరచేతుల్లో మహా సముద్రాన్ని పట్టుకుందాం అన్నంత అత్యాశ అవుతుంది. సూర్య భగవానుడి ని ఒంటి చేతి మీద బంతి లా ఆడించడం అంత అతిశయోక్తి అవుతుంది.
ఆయన ఒక మహార్ణవం. ఆయన కలం కోటి సూర్యుల తేజం. .వర్ణనాతీతం... ఆయన రాసే పాటల లోని పదాల అల్లిక విరజాజుల మాల. ఆస్వాదించే కొద్దీ ఆ సౌరభాలు మనసు మూలల్లోకి వెళ్లి ఒక అద్వితీయానుభూతి ని ప్రసాదిస్తాయి. ఇక్కడ మీతో పంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సిరివెన్నెల గారి మీద ఇంత గౌరవం అనుకోండి లేదా భక్తి అనుకోండి ( అది తమరికే వదిలేస్తున్నాను) మొదలైంది ఒక పాట తో... మీరందరూ 'నేనున్నాను' అన్న చిత్రం చూసే ఉంటారు అనుకుంటున్నాను. అందులో ' ఏ శ్వాస లో చేరితే ' పాట. అంతకు ముందు కూడా సిరివెన్నెల గారు చాలా పాటలు రాసారు. అవన్నీ అద్భుతాలే. కానీ నాకు ఊహ తెలిసిన తరువాత ఒక పాట వినగానే ఆ పాట రాసింది ఎవరో తెలుసుకుని ఆ పాటని మళ్ళీ మళ్ళీ విని పూర్తి గా ఆస్వాదించిన పాట ఇది. దాని కారణం గానే నా బ్లాగ్ ని కూడా ఇదే పాట తో మొదలు పెడదాం అని నిశ్చయించుకున్నాను.
పాట ఇలా సాగుతుంది.


ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ..
ఏ మోవి పై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో ..
ఆ శ్వాస లో నే లీనమై ఆ మోవి పై నే మౌనమై
నిను చేరనీ మాధవా.. "ఏ శ్వాస లో "


మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ..
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా..
తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మ కీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరిందీ అష్టాక్షరి గ మారిందీ..
ఎలా ఇంత పెన్నిధీ వెదురు తాను పొందినదీ
వేణు మాధవా నీ సన్నిధీ... "ఏ శ్వాస లో "


చల్లని నీ చిరునవ్వులు కనపడకా కను పాపకీ
నలువైపులా నడి రాతిరి ఎదురవదా..
అల్లన నీ అడుగుల సడి వినపడక హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా..
నీవే నడుపు పాదమిదీ నీవే మీటు నాదమిది
నివాళి గా నా మదీ నివేదించు నిమిషమిది..
వేణు మాధవా నీ సన్నిధీ.. "ఏ శ్వాస లో "


ఎంత అద్భుతమైన పాట.. చిత్రం లో 'అను' జీవితానికి(శ్రియ పోషించిన పాత్ర) పాటలో వెదురు/మురళి పాత్ర కి ఎంత గా పొంతన కుదిరిందంటే అసలు ఆ పాట కోసమే అను పాత్ర ని సృష్టించారేమో అన్నంత గా..
ఈ పాట లో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అద్భుతం.. గాలి గాంధర్వం అవుతుంది కృష్ణుడి శ్వాసలో.. ఎంత గొప్ప ప్రయోగం..!! ఆయన పెదవుల పై మౌనం కూడా మంత్రం అవుతుంది.
ఎందరో మునీశ్వరులకు కూడా తెలియని జపములు జరిపి ఉంటుందేమో ఆ మురళి.. లేకపోతే ఆ జగన్నాటక సూత్రధారితో అంత సఖ్యతా..? లేదంటే ఆది పూర్వ జన్మ సుకృతం ఐనా అయ్యుండొచ్చు.. ఒక వెదురు ముక్క కృష్ణుడి ని చేరి అష్టాక్షరి గా మారింది.. ఎంత అందమైన నిజం.. ఆ మనోహరుడి చేతిలో సప్త స్వరాలు పలికించు వేణువు ఊహ మనసుని పులకింపజేస్తుంది. మరి అంతటి అదృష్టం ఆ వెదురు ముక్క ఎలా పొందిందంటారు..??
ఆ చిరునవ్వులు కనపడక పోతే చీకటి మాత్రమే కనిపిస్తుందట.. మురళీధరుడి అడుగుల సడి హృదయానికి వినిపించకపోతే అలజడి తో అణువణువూ తడబడుతుంది. ఈ పాదాన్ని నువ్వే నడపాలి.. ఈ నాదాన్ని నువ్వే మీటాలి. ఇక కొసమెరుపు.. రాధికా హృదయ రాగాంజాలీ నీ పాదముల వ్రాలు కుసుమంజలీ ఈ గీతాంజలి..
విచిత్రం ఏమిటంటే పై వాక్యాలన్నీ ఆ కృష్ణ భగవానుడి కి ఎంత పొంతన గా ఉన్నాయో ఆ చిత్రం లోని కథా నాయకుడి పాత్ర కి అంటే పొంతన గా ఉంటాయి. ముఖ్యం గా "తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మ కీ తరగని వరముల సిరులని తలచినదా" ఈ వాక్యం అనుపమానం.. ఒక వెదురు ముక్క కి దాని తనువంతా గాయాలతో నిండి ఉన్నా ఆ గాయాలే దాని అదృష్టం అంట. ఆ గాయాల కారణం గానే ఆ మురళీధరుడి చేతి లో ఉండే అదృష్టాన్ని పొందింది. అలాగే అను పాత్ర కు జరిగే కొన్ని ఎదురు దెబ్బల కారణం గా కథానాయకుడికి దగ్గర అవుతుంది. అది తన అదృష్టం గా భావిస్తుంది.
సిరివెన్నెల గారి పాటల్లోకెల్లా ఇది గొప్ప పాట అని చెప్పను. ఇంతకంటే అద్భుతమైన వేల పాటలు ఆయన కలం నుండి అల్లుకుని విరజాజుల మాలలు అయ్యాయి. నా హృదయాన్ని మీటిన మొదటి పాటగా ఈ బ్లాగ్ లో దీనిని పరిచయం చేస్తున్నాను. మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఆయన పాటల అలల్ని ఎన్నిటినో మీ ముందుకు తీసుకు వస్తాను.
ఆ పాటల ఉప్పెనను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ.. మీ సలహాల కోసం ఎదురు చూస్తూ...
మీ..
అపర్ణ..

2 comments:

శిశిర said...
అపర్ణ గారు, బాగుందండి మీ బ్లాగు. మీ ప్రయత్నం కూడా. నేనూ సిరివెన్నెలగారి అభిమానినే. విరజాజిపూలు వర్షపు చుక్కలతో ఎంత బాగుందో ఫోటో. బాగా రాస్తున్నారు.
సిరివెన్నెల said...
ధన్యవాదాలు శిశిర గారు. క్షమించాలి, ఆలస్యానికి :). నిజానికి నాకు విరజాజి పూల ఫొటో దొరకలేదండీ.. ఆ ఫొటో లో ఉన్న పూలని మేము సన్నజాజులు అంటాం.. కొందరు వీటినే విరజాజులు అంటారంట. మీరు కూడా వీటినే విరజాజులు అంటారా..?